Venkatesh Netha: బీఆర్ఎస్ కు మరో భారీ షాక్.. పార్టీకి సిట్టింగ్ ఎంపీ గుడ్ బై
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. అసలే అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందే.. ఆ పార్టీకి మరిన్ని షాక్ లు తగులుతున్నాయి. కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రోబోతున్న వేళ ఆ పార్టీనేతలు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
Also read: Rahul Gandhi: జార్ఖండ్ లో భారత్ జోడో న్యాయ్ యాత్ర.. బొగ్గు సైకిల్ ను నడిపిన రాహుల్
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ను కలిశారు. అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.లోక్ సభ ఎన్నికలు 2019 కి ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు వెంకటేష్ నేత. పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మొదటిసారిగా ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి ఎంపీ ఇవాళ కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు షాక్ అనే చెప్పవచ్చు.
ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. పార్టీ మారట్లేదని వారు వివరణ ఇచ్చినా.. ఎప్పుడు ఏ నేత పార్టీకి గుడ్ బై చెప్తారో.. అని పార్టీ నేతలు, అధిష్ఠానానికి గుబులు పట్టుకుంది.