![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/07/rtc.jpg)
తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీనిని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచన చేస్తోంది. ఉచిత ప్రయాణం మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు వివిధ వర్గాలకు అందజేస్తున్న బస్ పాస్ మాదిరిగానే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన స్మార్ట్ కార్డులు కూడా జారీ చేస్తారు. వీటిని కూడా మరింత స్మార్ట్గా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇకపై అన్ని బస్పాస్లు కూడా స్మార్ట్గా మార్చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
Read also: T-Congress: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై కాంగ్రెస్ కసరత్తు.. ముహూర్తం ఖరారు?
ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇవ్వడంతోపాటు చిల్లర సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని బండ్లగూడ డిపోలోని కొన్ని బస్సుల్లో ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం విజయవంతంగా అమలవుతోంది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు. డిజిటల్ పేమెంట్ కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ పేరుతో ఐటిమ్స్ను ప్రవేశ పెట్టింది. బండ్లగూడలోని బస్సులతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో దీన్ని 3 నెలలుగా అమలు చేస్తున్నారు. అక్కడ ప్రయోగం విజయవంతం కావడం, వేరే సమస్యలు రాకపోవడం, చిల్లర బాధలు తీరడంతో తెలంగాణ అంతటా ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. ఇక నుంచి ప్రయాణికుడి వద్ద నగదు లేకపోయినా డెబిట్, క్రెడిట్ కార్డు, ఫోన్పే, గూగుల్పే లాంటి యూపీఐ యాప్ ద్వారా బస్సులో టికెట్ తీసుకోవచ్చు.