![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/CM-Revanth-Reddy-key-announcement-on-police-recruitment-780x470.jpg)
TS govt: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. నిన్న ఎల్బీ స్టేడియంలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం నియామక పత్రాలు అందజేసిన సందర్భంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాది క్రితం గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువరించినా, నియామక ప్రక్రియ మాత్రం ముందుకు వెళ్లలేదు. గ్రూప్-2 పరీక్ష ఇప్పటికీ జరగలేదు. ఇక గ్రూప్-1 పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం నిరుద్యోగులను మానసికంగా కుంగిపోయేలా చేసింది. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవడం వృథా అని భావించే పరిస్థితి వచ్చింది. అయితే సీఎం తాజా ప్రకటనతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి.
ALSO READ: యువతకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది: అనిల్ కుమార్ యాదవ్
ఉద్యోగ నియామకాలలో తప్పిదాలకు తావు లేకుండా, ఎవరికీ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని, టీఎస్పీఎస్సీలో గతంలో జరిగిన అక్రమాలను నిలువరిస్తామని సీఎం ప్రకటించడంతో నిరుద్యోగులు మళ్లీ సన్నద్ధతపై దృష్టి పెడుతున్నారు. త్వరలోనే గ్రూప్ -1లో 567 పోస్టుల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
గురుకుల టీచర్లుగా ఎంపికైన వారికి ఇవాళ సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు
మరోవైపు గురుకుల నియామక బోర్డు పరిధిలో ఖాళీగా ఉన్న టీచరు పోస్టులకు గతేడాది నిర్వహించిన పరీక్ష ఫలితాలను బోర్డు ప్రకటించింది. గత మూడు రోజులుగా కొనసాగిన సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి, తుది జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతానికి పీజీటీ టీచర్ పోస్టుల ఫలితాలను వెల్లడించగా మరికొన్ని రోజుల్లోనే డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టుల ఫలితాలను వెల్లడించనుంది. పీజీటీ టీచర్లుగా ఎంపికైన వారి వివరాలను గురుకుల బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. వారికి వ్యక్తిగతంగానూ సమాచారం ఇచ్చింది. పీజీటీ టీచర్లుగా ఎంపికైన 2009 మందికి ఇవాళ హైదరరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు.