Unemployment: కదం తొక్కిన నిరుద్యోగులు.. మోతీలాల్కు పెద్ద ఎత్తున మద్దతు!
ఎన్నికల సమయంలో నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే తమను పూర్తిగా విస్మరించిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య క్షీణించడంతో పోలీసులు ఆయనను ఓయూ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా, మోతీలాల్ ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్ నాయక్కు బీఆర్ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి.
ALSO READ: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై కాంగ్రెస్ కసరత్తు.. ముహూర్తం ఖరారు?
ఈ నేపథ్యంలో మోతీలాల్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నాకు దిగారు. అంతేకాదు, ఆదివారం గాంధీ ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.
నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు!
- గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
- గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
- ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి.
- 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలి.