![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/helicopter.jpg)
Helicopter: మేడారం జాతరకు సర్వం సన్నద్ధం.. అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు
మేడారం సమ్మక్క సారక్క జాతరలో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనున్న నేపథ్యంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బెంగళూర్కు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ భక్తులకు హెలీకాప్టర్ సేవలను అందించనుంది. అయితే, గత రెండు జాతరలతో పోలిస్తే ధరలు పెంచడంతో తగ్గించే విషయమై అధికారులు చర్చిస్తున్నారు.
Also read: Job Notification: మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు.. జీతం లక్ష రూపాయాలు
మేడారం జాతరలో తొలిసారిగా హెలికాప్టర్ సేవలు 2010లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ప్రధానంగా జాయ్ రైడ్ పేరుతో జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టనుంది. అమ్మవారి గద్దెల పక్కనుంచి మొదలయ్యే రైడ్ జంపన్నవాగు, చిలుకలగుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది. దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ.4800 ఛార్జీ వసూలు చేయనున్నారు.
ఇక షటిల్ సర్వీస్ పేరుతో హనుమకొండ నుంచి మేడారం జాతరకు మరో జర్నీ ఉంటుంది. హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వ కాశం ఉండగా.. ఒక్కొక్కరికి రానుపోను రూ.28,999 తీసుకుంటారు. ఇందులో భాగంగా స్పెషల్ పాస్ ఇస్తారు. దీంతో అమ్మవారి గద్దెల వద్ద వీవీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం సుబేదారిలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లేదంటే కాజీపేట ఫాతిమానగర్లోని సెయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ వేదికలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుత జాతరలో హనుమకొండ నుంచి రూ.28,999, మేడారం లోకల్ జాయ్ రైడ్ అయితే రూ.4800 రేట్లతో అధికారులకు వారం కింద కొటేషన్ ఇచ్చింది. పెరిగిన హెలికాప్టర్ ఫ్యూయల్ ధరల వల్లే తాము రేట్లు పెంచామని తుంబి ఏయిర్వేస్ ప్రతినిధులు చెబుతుండగా.. పెరిగిన ధరలు భక్తులకు ఇబ్బంది కలిగేలా ఉన్నాయని కలెక్టర్ ఆధ్వర్యంలోని టూరిజం అధికారులు సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. 21 నుంచి 25 వరకు సేవలు ఓకే చేసినప్పటికీ పెంచిన ధరల్లో ఎంతో కొంత తగ్గించేలా జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.