![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/polavaram.jpg)
Polavaram: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు..ఏం చెప్పారంటే?
Polavaram project: పోలవరం ప్రాజెక్టు పనులను ఆదివారం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు..మొదట ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం ఉదయం ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం సైట్ను పరిశీలించారు.
అమెరికా నుంచి డేవిడ్ పీ పాల్, గెయిన్ ఫ్రాంకో డీ సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ మేరకు నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు పనుల తీరు, ప్రాజెక్టు నిర్మాణం గురించి నిపుణులకు తెలిపారు. కాగా, తొలి రెండు రోజులు డయాఫ్రమ్ వాల్, రెండు కాపర్ డ్యామ్లు, గైడ్బండ్లను పరిశీలించనున్నారు.
ప్రాజెక్టు డిజైన్ నుంచి ఇప్పటి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మేధోమథనం చేయనున్నారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎంత నష్టం జరిగిందో చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉండటంతో కేంద్రం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపింది.
Also Read: కేజ్రీవాల్కు షాక్.. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ
ఏపీలో పోలవరం వద్ద గోదావరి నదిపై భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ బృందం పరిశీలనకు రంగంలోకి దిగింది.
కాగా, 2018లో ఈ డ్యాం భద్రతకు సంబంధించి విశ్లేషణల నివేదిక, ఎగువ కాఫర్ డ్యాం సీపేజీపై ప్రొఫెసర్ రాజు 2021లో ఇచ్చిన నివేదికలు, 2022, 2023 సంవత్సరాల్లో ఫీజోమీటర్ల సాయంతో సీపేజీపై జరిపిన విశ్లేషణలు, 2024 జనవరిలో సీఎస్ఎంఆర్ఎస్ సమర్పించిన నివేదిక, కొత్తగా వచ్చిన అఫ్రి సంస్థ జియో టెక్నికల్ పరిశోధనలకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయ నిపుణులకు అందిస్తారు.
జులై 3 వరకు అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్ద ఉండి పనులను పరిశీలిస్తారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.