![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/rain-alert-31-780x470.webp)
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
ALSO READ: టీ20 కప్ మనదే.. టీమిండియాకు ఉత్కంఠ విజయం
తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలోని అమలాపురం, కాకినాడ, నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.