![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/medaram.jpg)
Medaram Jatara: జాతరకు ముస్తాబవుతున్న మేడారం.. భారీ బందోబస్తు చేస్తున్న ప్రభుత్వం
వనదేవతల జాతర మరో కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈసారి కోటిన్నర మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల పాటు రద్దీగా ఉండే ఈ జాతరలో పోలీసు వ్యవస్థ ఎంతో కీలకం. అమ్మవారిని గద్దెల వద్దకు తీసుకెళ్లడం, ప్రముఖులకు భద్రత కల్పించడం, మేడారం వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడడం, జాతరలో రద్దీని నియంత్రించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం, దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పని పోలీసులపైనే ఆధారపడి ఉంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బందోబస్తు కీలకం. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు భారీగా పోలీసు బందోబస్తును సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also read: Telangana Government: ఫలించిన ఆటో డ్రైవర్ల పోరాటం.. యాదాద్రి కొండపైకి ఆటోలు
మేడారం జాతర పోలీసులకు సవాల్గా మారింది. జాతర ముగిసే వరకు 14 వేల మందితో భారీ భద్రతను నిర్వహించనున్నారు. ఇప్పటికే వరంగల్ ఐజీ డాక్టర్ తరుణ్ జోషి మేడారం మహాజాతర భద్రత, నిఘాపై కసరత్తు చేస్తున్నారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇన్ చార్జిగా పనిచేసిన ఆయన జాతరపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఐజీ, డీఐజీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 మంది డీఎస్పీలు, 400 మంది సీఐలు, 1000 మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మేడారమ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుండగా.. ఆ నాలుగు రోజుల్లోనే సుమారు కోటిన్నర మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా. భక్తుల రద్దీని అదుపు చేయడం కత్తిమీద సాములాంటిది. ఇక జాతర సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాతర రద్దీ నియంత్రణకు పోలీసులు బందోబస్తుతో పాటు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాల్లో మొత్తం 500లకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షిస్తామని ములుగు ఎస్పీ శబరీష్ ఇప్పటికే స్పష్టం చేశారు.
Also read: Central Government: సైబర్ భద్రతపై కేంద్రం ఫోకస్.. 1.4 లక్షల ఫోన్ నెంబర్ల బ్లాక్
సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు ఈసారి పెద్ద ఎత్తున ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అందుకు సంబంధించిన పనులపై దృష్టి సారించి వేగవంతం చేస్తున్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే మేడారం పనులను పర్యవేక్షిస్తున్న తరుణంలో జాతర సందర్భంగా రాష్ట్రంలోని మంత్రులంతా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాగే సాధారణ భక్తులు, వీఐపీ, వీవీఐపీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.