Vande Bharat Train: వందే భారత్ వచ్చేస్తోంది.. కాశ్మీర్ అందాలు చూసేందుకు సిద్ధమా?
త్వరలోనే జమ్మూ కాశ్మీర్ కు వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు.. కాశ్మీర్ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతూ వందే భారత్ రైలును ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఉదంపూర్- శ్రీనగర్- బారాముల్లా నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపించేందుకు ఎనిమిది కోచ్లను రైల్వే అధికారులు కేటాయించారు.
Also read: Covid 19: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీగా నమోదవుతున్న కేసులు
దాదాపు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులన్నీ పూర్తి కావొచ్చాయి. అయితే.. కొన్ని చోట్ల సొరంగాల వెంట పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక్కడ పనులు కాస్తా ఆలస్యం జరగొచ్చని రైల్వేశాఖ అధికారి ఒకరు చెప్పారు. వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వస్తే జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు దాదాపు మూడున్నర గంటల సమయం అదా అవుతుంది. ప్రస్తుతం 248 కిలోమీటర్ల పొడవైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి దాదాపు 7 గంటల సమయం పడుతోంది.
ఒకవేళ వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే.. జమ్ము కాశ్మీర్ లోయల్లోని కుంకుమపూల పొలాలు, యాపిల్ తోటల గుండా పర్యాటకులకు మరపురాని రైలు ప్రయాణ అనుభవం పొందవచ్చంటున్నారు. ట్రైన్ లో ప్రయాణిస్తూనే జమ్ము కాశ్మీర్ అందాలను తిలకించేందుకు ప్రత్యేకంగా విస్టాడోమ్ కోచ్లు ఏర్పాటు చేస్తున్నారు. రాంబన్ జిల్లా ఖరీ స్టాటన్లోని బనిహాల్ నుండి గత వారం 15 కిలోమీటర్ల మేర ట్రయల్ రన్ను రైల్వే అధికారులు విజయవంతంగా నిర్వహించారు.