Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ఈ నెల 4న కేబినెట్ విస్తరణ!
అధిష్టానం పిలుపు మేరకు రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్లనున్నట్లు సమాచారం. నేటి సాయంత్రానికి కేబినెట్ విస్తరణ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. అధిష్టానం పిలుపు కోసం సీఎం, డిప్యూటీ వెయిటింగ్ లో వున్నట్లు తెలుస్తుంది. అధిష్టానం నుండి పిలుపు వస్తే రేపు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం వెళ్లనున్నారు.
ఈ నెల 4న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని టాక్. ఆషాడం వస్తుండటంతో 4వ తేదీ లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంచనా. మార్పులు చేర్పులపై పార్టీలో చర్చ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీలో సీనియర్ నేత ఉత్తమ్ ఉన్నారు. అంతేకాకుండా.. పీసీసీ చీఫ్ పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ ఆశావహులు అంతా ఢిల్లీలోనే మకాం వేశారు.
మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని దామోదర రాజనర్సింహ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్పై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన కూడా ఉంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, దానం నాగేందర్లకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి వస్తుందని వెల్లడించారు.