Adudam Andhra: ఆణిముత్యాలను వజ్రాలుగా తీర్చిదిద్దుతాం: సీఎం జగన్
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులను వెలికితీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దోహదం చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. మట్టిలోని మాణిక్యాలను వజ్రాలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడులో మంగళవారం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్ ఆడారు. క్రీడాకారులతో మాట్లాడి వారికి కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు.
చదవండి: తెలంగాణ విద్యార్థినులకు గుడ్ న్యూస్
‘క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నా. నేటి నుంచి ఆడుదాం ఆంధ్ర 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది. క్రీడలు ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని చెప్పడానికి ఆడుదాం ఆంధ్ర ఒక ప్రచారంగా ఉపయోపడుతుంది. మధుమేహం నియంత్రణకు క్రీడలు చాలా మేలు చేస్తాయి. వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి’ అని సీఎం జగన్ తెలిపారు.
చదవండి: క్రీడలకు అడ్డా ఏపీ.. ఇదే సీఎం జగన్ కల.. నేటి నుంచే క్రీడా సంబరం
‘ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశం గ్రామాల్లోనే ఆణిముత్యాలను వెతకడం. ఆణిముత్యాన్ని వదిలే పరిస్థితి లేకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి మన పిల్లలను పరిచయం చేయడం. కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులు స్థాపించే బ్యాడ్మింటన్ అకాడమీలతో ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారు’ అని సీఎం జగన్ చెప్పారు. క్రీడా సంబరాల ప్రారంభోత్సవంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సరదాగా పలు ఆటలు ఆడారు.