![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-15-at-1.07.55-PM-780x470.jpeg)
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని ఆయన ఘంటాపథంగా చెప్పారు. అంతేకాదు, విశాఖను ఆర్థిక రాజధానిగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు అభివృద్ధికి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ మేరకు చంద్రబాబు సీఎంగా భాద్యతలు తీసుకున్న వెంటనే రాజధాని అమరావతి నిర్మాణానికి ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
ALSO READ: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ
ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చే నడుస్తోందట. గతంలో కూడా రూ.10 కి తక్కువ కాకుండా అమరావతి నిర్మాణానికి విరాళం పంపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా రూ.100కు తక్కువ కాకుండా విరాళం పంపాలని పిలుపు ఇస్తే ఎలా ఉంటుందని టీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. అయితే, ఈ ఆలోచనను టీడీపీలోని కొంత మంది నేతలు తప్పు పడుతున్నారు. గతంలో ఇలాగే పిలుపు ఇచ్చి, మిగిలిన ప్రాంతాలకు శత్రువులయ్యామని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి దోచేస్తోందనే సంకేతాలు వెళ్తాయని, తమ ప్రాంతాల కోసం విరాళాలను ఎందుకు సేకరించరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందనే వాదన చేసినట్టు తెలిసింది. అయితే అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల కోట్లైనా పెట్టుబడి పెట్టాల్సిందే అని, ఆ తర్వాతే మిగిలిన అంశాలని మరికొందరు టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.