AP Budget: సంక్షేమానికి భారీగా కేటాయింపులు… ఏపీ బడ్జెట్ ఎంతంటే?
ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను 2024-25 వార్షిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389 కోట్లను ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ఆదాయ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లుగా పేర్కొన్నారు. కాగా, ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు ఉండగా.. రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు ఉంది. ఇక ఇందులో జీఎస్డీపీలో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందన్నారు.
ALSO READ: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే?
కేటాయింపులు ఇలా!
ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేయడంతోపాటు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. ముఖ్యంగా బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.71,740 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అలాగే రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో నాలుగు ఓడ రేవుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు తొమ్మిది జిల్లాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10,107 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా, ఈ ఏడాది రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రులు, నాలుగు ఇతర ఆస్పత్రులు, మూడు నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు.
ALSO READ: మూడో రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ప్రవేశపెట్టనున్న బిల్లులు ఇవే?
పారదర్శకంగా సంక్షేమ పథకాలు
అంబేద్కర్ ఆశయాలే ప్రభుత్వానికి ఆదర్శమని, చాణక్యుడి తరహాలో జగన్ పాలన అందిస్తున్నారని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు. 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు, 2.6లక్షల మంది వలంటీర్లతో గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తెచ్చామన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.37,374 కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు.
ALSO READ: ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు?.. ఈసీ క్లారిటీ
మరికొన్ని అంశాలు..
మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన.. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను సీఎం జగన్ చేపట్టారన్నారు. ఈ మేరకు సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర వంటి ఏడు అంశాల వారీగా బడ్జెట్ రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించారు.
జగన్నన గోరుముద్ద – రూ.1,910కోట్లు
జగనన్న విద్యాదీవెన – రూ.11,901 కోట్లు
జగనన్న వసతి దీవెన – రూ.4,267కోట్లు
జగనన్న పాలవెల్లువ – రూ.2,697కోట్లు
వైఎస్సార్ చేయూత – రూ.14,129 కోట్లు
ఉచిత పంటల బీమా – రూ.3,411 కోట్లు
సున్నా వడ్డీ పంట రుణాలు – 1,835 కోట్లు
వైఎస్సార్ బీమా – రూ.650 కోట్లు
కల్యాణమస్తు, షాదీ తోఫా- రూ.350 కోట్లు
ఈబీసీ నేస్తం – రూ.1,257 కోట్లు
కాపునేస్తం – రూ.39,247 కోట్లు
నేతన్ననేస్తం – రూ.983 కోట్లు
జగనన్న తోడు – రూ.3,374 కోట్లు
జగనన్న చేదోడు – రూ.1268 కోట్లు
వాహనమిత్ర – రూ.1,305 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు – రూ.883.5కోట్లు.