![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-17.57.02_cb08baf8.jpg)
AP Elections: ఏపీలో కులగణన.. ఏ వర్గాలకు ఎంతమేర లాభం?
ఏపీలో రాష్ట్ర వ్యాప్త కులగణన ప్రారంభమైంది. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరిగిన రోజే సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పది రోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా, కులగణనలో మిగిలిపోయిన వారి కోసం మరో 5 రోజులు సచివాలయాల్లో సర్వే కోసం అవకాశం కల్పించనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. తొలిరోజు 14,334 సచివాలయాల్లో కులగణన ప్రక్రియ మొదలైంది. అయితే కులం వివరాలు వెల్లడించడానికి ఆసక్తి చూపనివారికి, కుల పట్టింపులు లేని వారి కోసం నో- క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో చేర్చారు.
ALSO READ: త్వరలో టీడీపీ ఖాళీ.. కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు
సీట్లు, రిజర్వేషన్లు పెరిగే అవకాశం..
రాష్ట్రంలో మొత్తం 723 కులాలకు సంబంధించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా విభజించనున్నారు. బుడగ జంగాలు, పిరమలై కల్లర్(తేవర్), యలవ కులాలను ఇతర కులాల జాబితాలో నమోదు చేస్తారు. కాగా, దేశంలోనే బీహార్ తర్వాత కులగణన చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. అయితే రాష్ట్రంలో దాదాపు 50 శాతం ఉన్న అణగారిన వర్గాల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు, రిజర్వేషన్లు పెరిగే అవకాశంతో పాటు వారికి పదవుల విషయంలో భారీ సంఖ్యలో ప్రయోజనం చేకూరనుంది.
ALSO READ: కళాకారులకు గుర్తింపు కార్డులు.. డప్పు వాయించిన రోజా
వారికే ప్రయోజనం చేకూరనుందా?
టీడీపీ గతంలో దశాబ్దాల పాటు అణగారిన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇందులో భాగంగానే ఆ వర్గానికి చెందిన నాయకులకు ఉన్నత పదవులు అప్పగించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీకి కొన్ని కులాలు దూరమయ్యాయి. తాజాగా, కులగణనతో జనాభా ఎంతోమేర ఉన్నారనే విషయం స్పషం కావడంతో మార్పులు చేసుకునే అవకాశం ఉండనుంది. వచ్చే ఎన్నికల్లో అటు వైసీపీ, ఇటు టీడీపీలు హామీలు ప్రకటించనున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎక్కువ జనాభా ఉన్న అణగారిన వర్గాల ప్రజల కోసం హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, ఈ విషయంలో వైసీపీతో పోటీ పడి టీడీపీ కేటాయింపులు చేస్తే అణగారిన వర్గాలకు ఎక్కువగా ప్రయోజనం ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.