![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-16-at-17.45.01_7440b4e5.jpg)
AP Elections: బీజేపీతో టీడీపీ పొత్తు..తెరపైకి కొత్త ప్రతిపాదనలు!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులో ఉండగా.. మళ్లీ టీడీపీ, బీజేపీ పొత్తుపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని భావించారు. కానీ, పొత్తుపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలోనే బీజేపీ నుంచి టీడీపీకి తాజా ప్రతిపాదన అందినట్లు సమాచారం.
ALSO READ: పారిశ్రామిక హబ్లుగా విశాఖపట్నం, విజయవాడ
సీట్లపై బీజేపీ కసరత్తు..
చంద్రబాబుతో చర్చలు జరిపిన అమిత్ షా.. బీజేపీకి అడిగిన అసెంబ్లీ స్థానాల వివరాల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానాన్ని ఆదేశించారు. చంద్రబాబు, అమిత్ షా భేటీ జరిగిన పది రోజులు గడిచిన పొత్తుపై ఎలాంటి నిర్ణయం బయటకు రాలేదు. ఈ సమయంలోనే పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుందని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని..ఆ పార్టీతో కలిసి ముందుకెళ్లాలని పరోక్షంగా పొత్తుపైన సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 అసెంబ్లీ స్థానాలపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సీట్లపై కసరత్తు చేసి రాష్ట్ర బీజేపీ అధినాయత్వం 20 అసెంబ్లీ స్థానాలతో ఓ జాబితాను కూడా రూపొందించింది.
ALSO READ: జగన్ మరో ముందడుగు..‘ఎడెక్స్’తో ఒప్పందం
కోరిన స్థానాలు ఇవే..
ఉమ్మడి కర్నూల్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి చూపుతోంది. తూర్పు గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 1, పశ్చిమ గోదావరిలో 3 సీట్లలో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ హైకమాండ్కు ఏపీ బీజేపీ రిపోర్టును పంపింది.