AP Government: పోలీసుల ‘పల్లె నిద్ర’.. శాంతి భద్రతల పరిరక్షణకు ఏపీ సర్కార్ కసరత్తు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఏపీ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలో ఏపీలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడుకునేందుకు ప్రధానంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘా మరింత పటిష్టం చేయనుంది. ఈ మేరకు పోలీసు అధికారుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ఎస్ఐ నుంచి ప్రధాన ఉన్నతాధికారి వరకు నిత్యం ఒక పల్లెలో గ్రామసభ నిర్వహణ చేసేలా ఆలోచిస్తోంది.
ALSO READ: ముగిసిన ఎన్నికలు.. ఇక అందరి దృష్టి అటే!
పైలెట్ ప్రాజెక్ట్గా ‘చిత్తూరు’..
‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో భాగంగా మొదట గ్రామాల వారీగా డేటా సేకరించనున్నారు. ఆ తర్వాత రోజుకో పల్లెలో గ్రామసభ నిర్వహించి ప్రజల్లో అవగాహనతోపాటు అసాంఘిక శక్తులకు సంబంధించిన వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తిస్తున్నారు. అయితే దీనికోసం రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ALSO READ: శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్ కార్యాచరణ: చంద్రబాబు
ప్రత్యేక యాప్లో డేటా..
గ్రామంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. జైలు నుంచి విడుదలై వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు స్థానికేతరులపై కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచనున్నారు. జిల్లాల వారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను పోలీసుల సేకరించిన తర్వాత ప్రభుత్వానికి పంపనుంది. వివిధ కేటగిరీలుగా సేకరించిన ఈ డేటా మొత్తం ప్రత్యేక యాప్లో ఎంటర్ చేయనున్నారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ ఆఫీసు వరకు అందుబాటులో ఉండనుంది. దీంతో ఏదైనా సమస్య ఎదురైతే ముందస్తు చర్యలు తీసుకునేందుకు సులభతరం కానుంది.