AP Government: కీలక నిర్ణయాలు.. ఇక జనవరి నుంచే అమలు!
సామాజిక పింఛన్ కింద మరోసారి కొత్త పింఛన్ల మంజూరుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ పెన్షన్ కానుకగా ప్రస్తుతం రూ.2,750 ఉన్న పెన్షన్ను జనవరి నుంచి రూ.3 వేలు చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ను అవ్వా తాతలు, వితంతువులు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందించే పింఛన్ను దశల వారీగా పెంచుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 66,34,742 మంది లబ్ధిదారులు ఉండగా.. వీరందరికీ పెన్షన్లు అందించేందుకు రూ.1,968 కోట్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ పింఛన్, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సీఎం జగన్ మాట్లాడారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడంతోపాటు పేదలు సైతం తమ కాళ్ల మీద నిలబడేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిందని తెలిపారు.
ALSO READ: వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. అక్కడి నుంచే పోటీ?
19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
సామాజిక న్యాయం ప్రతిబింబించేలా జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చరిత్రలో నిలిచిపోయే బహుమానమన్నారు. అదే విధంగా పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా ఆదుకునేలా జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని, వీరికి రూ.6,400 కోట్లు చెల్లించనున్నారు. దీంతోపాటు చేయూత పథకం కింద ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 26.39 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు. అదే విధంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు అందిస్తామని సీఎం వెల్లడించారు. అయితే ఉత్తమమైన వాటికి సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు బహుమతిగా ఇస్తామన్నారు.
ALSO READ: ఓటమి నుంచి తేరుకున్న బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికలపై దృష్టి
అదనంగా 1.7 లక్షల మందికి పెన్షన్లు..
అర్హత ఉండి ఎవరైనా మిగిలిపోయిన వారి కోసం రీ వెరిఫికేషన్లో భాగంగా జనవరి 5న బై యాన్యువల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 1న అదనంగా 1.7 లక్షల మందికి పెన్షన్లు అందజేయనున్నారు. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు. పింఛన్ కానుక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలన్నారు. జనవరి 3న పెన్షన్ల కార్యక్రమంలో నేను కాకినాడలో పాల్గొననున్నట్లు చెప్పారు. ఇంతగా అవ్వాతాతలను పట్టించుకున్న ప్రభుత్వం లేదన్నారు. ఆత్మగౌరవం కాపాడుతూ ఇంటికే పింఛన్ అందిస్తున్నామన్నారు. వాలంటీర్ వ్యవస్థతో పింఛన్ కూడా ఎక్కువగా అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమం 8 రోజులపాటు జరుగుతుందని, ప్రతి మండలంలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సూచించారు.