AP Education: బేబీకేర్ సెంటర్లు.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయమే!
బాలికా విద్యాభివృద్ధే ధ్యేయంగా ఏపీ సర్కార్ దూసుకెళ్తోంది. ప్రధానంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కేజీబీవీల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తుంది. అయితే కేజీబీవీలో కొత్తగా చేరిన టీచర్లకు బోధనా నైపుణ్యాలతో పాటు విద్యార్థులు, సహచరులతో మెలగాల్సిన విధానాలపై శిక్షణ ప్రత్యేక శిక్షణ కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ శిక్షణ కేంద్రానికి కొంతమంది చిన్నపిల్లలతో వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల ఇబ్బందులు, ఏకాగ్రత కోల్పోకుండా వారి పిల్లల సంరక్షణ బాధ్యతను తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారు శిక్షణ పొందుతున్న ప్రాంగణాల్లోనే ప్రత్యేక బేబీకేర్ సెంటర్ల (ఎఫ్ఎల్ఎన్ కిడ్స్స్పేస్)ను ఏర్పాటుచేసింది.
సంరక్షకులుగా అంగన్వాడీ కార్యకర్తలు
ఉద్యోగం సాధించిన టీచర్లకు వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో టీచర్ల పిల్లల కోసం బేబీకేర్ సెంటర్లలో సంరక్షకులుగా అంగన్వాడీ కార్యకర్తలు కేటాయించారు. ఇందులో పిల్లలు తినే ఆహారం.. ఏ సమయానికి ఏం తింటారు.. ఎప్పుడు నిద్రపోతారు.. ఇలా అన్ని వివరాలను తీసుకుని ప్రత్యేకంగా పాలు, ఆహారం, ఆట వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. ఉదయం టీచర్లు ఉపాధ్యాయ శిక్షణకు హాజరయ్యే సమయంలో పిల్లలను ఈ కిడ్స్స్పేస్లో వదిలి సాయంత్రం తిరిగి తీసుకెళ్తారు. కాగా, సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు విజయవాడ, విశాఖపట్నంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కిడ్స్స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
టీచర్ల ఏకాగ్రత శిక్షణపై ఉండేలా
రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల్లో బోధన కోసం 1,190 మందిని టీచర్లుగా నియమించింది. ఇక్కడకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది చంటి పిల్లలతో వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ‘ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ కిడ్స్ స్పేస్’ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇందులో టాయ్స్ కార్నర్, హోలిస్టిక్ డెవలెప్మెంట్ సెంటర్, స్లీపింగ్ కార్నర్, స్టోరీ టెల్లింగ్ కార్నర్, మదర్/గార్డియన్ను అందుబాటులో ఉంచారు. ప్రధానంగా టీచర్ల ఏకాగ్రత శిక్షణపై ఉండేలా పిల్లల సంరక్షణ బాధ్యత అధికారులే తీసుకోవడం ఇదే ప్రథమం. ఈనెల 16 నుంచి అనంతపురం, తిరుపతిలో టీచర్ల శిక్షణ మొదలవుతుందని, అక్కడ కూడా ఇదే తరహా బేబీకేర్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.