Janasena: జనసేనకు కనీసం 40 నుంచి 60 సీట్లు ఇవ్వాలి: హరిరామ జోగయ్య
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్కు లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఈ సారి రాసిన బహిరంగ లేఖలో కీలక అంశాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ను ఓడించాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలని సూచించారు.
Also Read: బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలి: ఎమ్మెల్సీ కవిత
అంతేకాకుండా పలు అంశాలపై పవన్ కళ్యాణ్ కు ప్రశ్నలను సంధించారు. వైఎస్ఆర్సీపీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబుకు పదవిని కట్టబెట్టడమా? అని ప్రశ్నించారు. చంద్రబాబును అధికారంలోకి తేవడం కోసం కాపులు పవన్ కళ్యాన్ వెంట నడవడం లేదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే రెండేళ్లు పవన్ సీఎం అని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రతిపాదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాల్సి ఉంటుందని హరిరామ జోగయ్య అన్నారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్పులు.. నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా?
టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే సీట్ల గురించి చర్చంచడానికి పలుమార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయినా సీట్ల పంపకం మాత్రం కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ నిన్న మరోసారి కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. పొత్తుల కారణంగా రెండు పార్టీల్లో సీట్లు కోల్పోతున్న ఆశావహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి.. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.