RK: జగన్, షర్మిలపై ఆర్కే తీవ్ర వ్యాఖ్యలు.. ఆ పార్టీలోనే చేరుతా?
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నాయి. ఇటీవల పార్టీ సీనియర్ నాయకుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా సమయంలో నోరు విప్పని ఆర్కే తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read కదన రంగంలోకి గులాబీ దళం.. అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యం
మంగళగిరిలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్కే సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆమె వెంట ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ‘మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. రూ.1,200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లు మాత్రమే కేటాయించారు. నా సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేశా. నాలుగేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపించా. వ్యక్తిగతంగా నేను రూ.8 కోట్ల వరకు బయట అప్పులు చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చా’ అని వివరించారు.
Also Read సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు
వేరే పార్టీలో చేరికపై స్పందిస్తూ.. ‘నేను ఏ పార్టీలో చేరినా అదే రోజు నిర్ణయం చెబుతా. చాలా మంది నన్ను ఇతర పార్టీలు ఆహ్వానించాయి. వైఎస్ కుటుంబంతోనే ఉన్నా.. ఉంటానని వారికి చెప్పా’ అని ఆర్కే స్పష్టం చేశారు. ఇక రేవంత్ రెడ్డిపై స్పందిస్తూ.. ‘చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోను. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా.. నా పోరాటం ఆగదు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా? తప్పు ఎవరూ చేసినా తప్పే’ అని స్పష్టం చేశారు. ఆర్కే వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.