Praja Darbar: తెలంగాణలో ప్రజా దర్బార్.. మరి ఏపీలో..?
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతమై.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక ఇన్ని రోజులు బీఆర్ఎస్ పాలనలో ప్రగతిభవన్ వైపు కన్నెత్తి కూడా చూడలేని రాష్ట్ర ప్రజలు.. ఇప్పుడు ఏకంగా అందులోకే వెళ్లే రోజులు వచ్చాయి. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ప్రగతిభవన్ పేరును.. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ గా మార్చారు. ఇక నుంచి ప్రతిరోజు సీఎంతో ప్రజాదర్బార్ ఉంటుందని.. ప్రజలంతా ప్రజాభవన్ కు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చని వెల్లడించారు. అందులో భాగంగానే శుక్రవారం నుంచి సీఎం ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించగా.. పెద్దఎత్తున్న ప్రజలు ప్రజాభవన్ కు క్యూ కట్టారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వారి సమస్యలను స్వయంగా విని పరిష్కారానికి ఆయా శాఖలకు పంపారు.
Also read: Minister Roja: మంత్రి రోజా కామెంట్స్.. అన్ని వయస్సుల వారు రావాలని పిలుపు
నిజానికి ప్రజా సమస్యల కోసం సీఎం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం అనేది మంచి పనే. గత బీఆర్ఎస్ పాలనలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఎనాడూ అలాంటి పనులు చేయలేదు. అయితే ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎక్కడో జిల్లాల నుంచి అనేక ప్రయాసలు పడుతూ అక్కడికి చేరుకున్నారు. అయితే అందులో కొన్ని చిన్న సమస్యలు ఉన్నప్పటికీ.. జిల్లా, స్థానిక మండల, గ్రామ స్థాయిలో అధికారులు విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు.. అవినీతికి పాల్పడుతూ.. ప్రజలను వారి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన బాధితులు నేరుగా సీఎంను కలిసి.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రికి చెప్పుకుంటేనైనా తమ సమస్యలు త్వరగా పరిష్కరమవుతాయనే భావనతో అక్కడకు వచ్చినట్టు వారు వెల్లడించారు.
కానీ ఏపీలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో వాలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ప్రభుత్వ సేవలు అందించే విధంగా పాలనకు రూపకల్పన చేశారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. తగిన సిబ్బందిని నియమించారు. వీరంతా.. వారి పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు, అక్కడే పరిష్కారం చేస్తున్నారు. దీంతో బాధితులు సమస్య పరిష్కారానికి సీఎం కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పింది.
Also read: Ashwini Vaishnaw: విజయనగరం రైలు ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు.. ప్రమాదానికి అదే కారణమట?
అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందన పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రస్థాయి నుండి మండల, గ్రామస్థాయి అధికారుల వరకు అనుసంధానం చేస్తూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చారు. సీఎం జగన్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. ఎప్పటికప్పుడు పోర్టల్ పనితీరుపై ఆరా తీస్తున్నారు. ముందుగా స్థానికంగా అధికారులు అర్జీని తీసుకుని ఆన్ లైన్ లో నమోదు చేసి రశీదు ఇస్తారు. అనంతరం దరఖాస్తును స్కాన్ చేసి సంబంధిత అధికారులకు పంపుతారు. నిర్ధిష్ట కాలవ్యవధిలో సమస్యను పరిష్కరిస్తారు. అలాగే ప్రజలే నేరుగా కూడా ఈ పోర్టల్ తమ సమస్యను రిజిస్టర్ చేసుకోవచ్చు. గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలు చెప్తూ.. పై స్థాయి అధికారులకు అర్జీని పంపుతారు. సమస్యపై ప్రజలు ఆరా తీసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా కేటాయించారు.
అలాగే రాష్ట్రంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంది. నెలనెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ, ఇంటి వద్దకే వచ్చి వారివారి ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారు. అలాగే ఇంటి వద్దకే వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరోవైపు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాలనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మార్పు చేశారు. ఇలా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు టాక్.