YS Jagan: పేదింటి ఆడపిల్లలకు పెళ్లి కానుక.. అకౌంట్లో నగదు జమ చేసిన సీఎం
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు కార్యాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని అర్థం. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంత తక్కువ ఖర్చుతో వేడుక నిర్వహించాలన్నా పెళ్లికి బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, పెళ్లి మండపం ఇలా పెళ్లి భజంత్రీ మోగే వరకూ ఖర్చులు తడిసిమోపడవుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని వారికి పెళ్లి సమయంలో అండగా నిలబడేందుకు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ పెళ్లికానుక (వైఎస్సార్ కల్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా) పథకాలకు శ్రీకారం చుట్టారు.
ALSO READ: విశాఖ రాజధాని ఏర్పాటులో కీలక అడుగు.. ప్రభుత్వ భవనాలు కేటాయింపు
10,511 జంటలకు రూ. 81.64 కోట్లు..
వైఎస్సార్ కల్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను సీఎం వైఎస్ జగన్ ఇవాళ విడుదల చేశారు. ఈ ఏడాది వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు.
ALSO READ: ఎన్నికల బరిలో యువతులు.. నెగ్గుతారా?
అర్హతలు ఎందుకంటే?
పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్సార్ కల్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు కొన్ని అర్హతలు నిర్ణయించారు. వధూవరులిద్దరు కచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తేనే అర్హులుగా గుర్తిస్తారు. దీంతో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ విధానంతో గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుతున్నాయి. అలాగే 18 ఏళ్లు తప్పనిసరి చేయడంతో బాల్య వివాహాల నివారణ సాధ్యమవుతోంది. కావున పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు దాటి ఉండాలన్న నిబంధనను అమలు చేస్తున్నామన్నారు. తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మ ఒడి తెచ్చామని, ఈ పథకం ఇంటర్ వరకు వర్తిస్తుందన్నారు. ఇంటర్ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉండడంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నామని పేర్కొన్నారు.
ALSO READ: ‘జగనన్న గోరుముద్ద’కు కేంద్ర పురస్కారం
పేదలందరికీ విద్య.. పథకం లక్ష్యం
పేదలందరికీ విద్య అందించడంలో భాగంగా విద్యాసంస్కరణలు తీసుకొచ్చామన్నారు ప్రజలంతా ఉన్నత విద్య వైపునకు వెళ్లడానికే మోటివేషన్ చేయడమే ఈ పథకం లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం, బీసీ కుటుంబాలకు రూ. 50వేల ఆర్థిక సాయం’’ అందిస్తున్నామని సీఎం తెలిపారు. కాగా, కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకు ఇస్తున్న వారిలో 8,042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు.