Liquor Case: ఏడో సారీ.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ నో!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ స్కాం పట్టిపీడిస్తోంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు పంపించారు. ఆయన ఏడో సారి కూడా విచారణకు నిరాకరించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీ అధికారులకు లేఖ రాసింది. అంతేకాదు, చట్టపరమైన ప్రక్రియను ఈడీ గౌరవించాలని సూచించింది. కేజ్రీవాల్కు పదే పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది.
ALSO READ: కుప్పంపై జగన్ ముద్ర.. చంద్రబాబుకు ఎదురుగాలి!
కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు ఈడీ ఇదివరకే ఆరుసార్లు నోటీసులు జారీ చేసింది. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ ఏమాత్రం స్పందించలేదు. ఆ తర్వాత జనవరి 13వ తేదీన, జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన.. మొత్తం ఆరుసార్లు నోటీసులు పంపించారు. వీటీలో కేజ్రీవాల్ ఏ ఒక్కసారి విచారణకు హాజరుకాలేదు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించాలని చూస్తోందని ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇవాళ విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు లేఖ రాశారు.