Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసన.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ లో నిబంధనలు ఉల్లంఘించి కొందరు యువకులు ప్రవేశించిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్లమెంట్ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో కొందరు యువకులు సభలోకి వచ్చి పొగ విడుదల చేశారని.. దానికి బీజేపీ ఎంపీలు వెనక్కి తగ్గి.. పారిపోయారని, ఉంకీ హవా నికల్ గయీ(వారు గట్టిగా భయపడిపోయారు)” అని రాహుల్ ఎద్దేవా చేశారు.
Also read: Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు… చీఫ్ గెస్ట్ గా మెక్రాన్
ఈ సంఘటనకు కారణం నిరుద్యోగమే అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2001 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 రోజునే నిందితులు పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసుల సాయంతో పార్లమెంట్లోకి చేరి, సభ జరుగుతున్న సమయంలో పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే విధంగా చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఈ వ్యవహారంపై చర్చించాలని, కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ.. సభా కార్యకలపాలను అడ్డుకున్నారు. దీంతో లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఏకంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా బ్లాక్కు చెందిన నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎం)కి చెందిన సీతారాం ఏచూరితో సహా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు.