Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ మరో యాత్ర.. 14 రాష్ట్రాలు.. 6,200 కిలోమీటర్లు
దేశవ్యాప్తంగా అచేతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో యాత్ర’తో ఊపిరిలూదాడు. నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో పాదయాత్రతో ఉత్సాహం నింపాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మరో యాత్రకు రాహుల్ సిద్ధమయ్యాడు. జోడో 2.0 అని మొదట అనుకున్నా తాజాగా ఆ యాత్ర పేరు మారింది. ‘భారత్ న్యాయ యాత్ర’ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన యాత్ర ఇప్పుడు ఈశాన్యం నుంచి పశ్చిమం వైపు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈశాన్య రాష్ట్రం నుంచి యాత్ర మొదలుపెడతారని సమాచారం. జనవరి 14వ తేదీ నుంచి రాహుల్ న్యాయ యాత్ర ప్రారంభిస్తారని ఏఐసీసీ ప్రకటించింది.
Also Read కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు.. రేపటి నుంచే స్వీకరణ
ఢిల్లీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత్ న్యాయ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్ ప్రారంభమై మార్చి 30న మహారాష్ట్రలోని ముంబైలో ముగుస్తుంది. మొత్తం 6,200 కిలోమీటర్లు యాత్ర కొనసాగుతుందని సమాచారం. మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగుతుండగా.. 85 జిల్లాల్లో రాహుల్ సభలు ఉంటాయని తెలిసింది. దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం చేపడుతున్న యాత్ర కావడంతో ‘భారత్ న్యాయ యాత్ర’ అని పేరు పెట్టినట్లు ఏఐసీసీ తెలిపింది.
ఈ యాత్ర పూర్తిగా పాదయాత్ర కాదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు యాత్ర జరిగే ప్రాంతాల్లో కొండ, లోతట్టు ప్రాంతాల్లో ఉండడంతో పాదయాత్రకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పాదయాత్ర సాధ్యం కాని ప్రాంతాల్లో బస్సు యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలోకి దిగనుంది. ఈ యాత్రతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వస్తాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
Also Read ఫాక్స్ కాన్ కంపెనీ ఎక్కడికీ పోలేదు.. మేం సహకరిస్తాం: తెలంగాణ ప్రభుత్వం