Senthamarai Stalin: ఇది సనాతన ధర్మం కాదా?… మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను ప్రశ్నిస్తున్న నెటిజన్లు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమసిపోకముందే ఇప్పుడు మరో వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనికి కారణం స్టాలిన్ కుమార్తె సెథామరై స్టాలిన్ ఆలయంలో ప్రార్థనలు చేయడమే. మైలాడుతురై జిల్లాలో సిర్కాజీలోని సత్తైనాథర్ దేవాలయంలో సెంథామరై పూజలు చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ… దీనిని ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. ఇది సనాతన ధర్మం కాదా? అని ట్రోల్స్తో విరుచుకుపడుతున్నారు.
గత కొన్ని రోజుల ముందు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపింది. సనాతన ధర్మన్ని డెంగ్యూ, మలేరియా లతో పోల్చారు. దీనిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యనించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై అయోధ్య సాధువు తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి తల నరికి తీసుకొస్తే 10 కోట్ల నగదు బహుమతి ఇస్తానని జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన జనజాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఉదయనిధిని చెప్పుతో కొడితే 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏపీలోని విజయవాడలో పోస్టర్లను కూడా అంటించింది.