Telangana ఎన్నికలకు హీరోయిన్ సౌందర్యకు ఏం సంబంధం? మీకు తెలుసా?
కరీంనగర్: అందం, అభినయం కలగలిసిన సినీ తార సౌందర్యను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరు. తెలుగు, కన్నడ ప్రజల ఆదరాభిమానాలను పొందిన సౌందర్య (Soundarya) మరణించి దాదాపు రెండు దశాబ్దాలైనా ప్రజలు మాత్రం మరచిపోలేదు. ఇప్పటికీ టీవీల్లో ఆమె సినిమాలు (Movies) వస్తే ఒక విధమైన భావోద్వేగానికి లోనవుతారు. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే తెలంగాణ ఎన్నికలతో సౌందర్యకు దగ్గరి సంబంధం ఉంది. తెలంగాణలో ప్రచారం చేసేందుకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (Helicopter) ప్రమాదానికి గురై కుప్పకూలింది. ఆ సంఘటనలో సౌందర్య దుర్మరణం పాలయ్యారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలకు ఆ ప్రమాదమే గుర్తుకు వస్తుంది.
Read Also: ఇల్లు లేక బాత్రూమ్ లో మహిళ నివాసం.. ఇది కేసీఆర్ పాలన
ఏం జరిగింది?
అది 2004 ఎన్నికల సమయం. అప్పటికే వందల చిత్రాల్లో నటించి అగ్రతారగా గుర్తింపు పొందిన సౌందర్య ఎన్నికల సమయంలో బీజేపీలో (BJP) చేరింది. నాటి ఉమ్మడి ఏపీలో ఎన్నికలు (Elections) రావడంతో సౌందర్య ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కరీంనగర్ (Karimnagar) లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున చెన్నమనేని విద్యాసాగర్ రావు బరిలోకి దిగగా.. అతడికి మద్దతుగా సౌందర్య ప్రచారం చేయాల్సి ఉంది.
ప్రచార సభలు.. సంతాప సభలు
ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 17న కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లతోపాటు కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచారం కోసం తన సొంత గడ్డ బెంగళూరు (Bengaluru) నుంచి హెలికాప్టర్ లో సౌందర్య బయల్దేరారు. పైకి ఎగిని కొద్దిసేపటికే హెలికాప్టర్ కుప్పకూలింది. మంటలు చెలరేగి హెలికాప్టర్ కాలిపోయింది. ఆ మంటల్లోనే అభిమాన నటి సౌందర్య సజీవ దహనయ్యారు. ఈ వార్తతో దేశమంతా విషాదం నెలకొంది. సౌందర్య పాల్గొనాల్సిన బహిరంగసభలు, రోడ్ షోలు సంతాప కార్యక్రమాలుగా మారాయి. ప్రస్తుతం తెలంగాణలో (Telangana) ఎన్నికలు జరుగుతున్న వేళ నాటి విషాద సంఘటనను కరీంనగర్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల కోసం బయల్దేరి సౌందర్య ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఆస్తుల్లోనూ తగ్గేదేలే.. కేటీఆర్, హరీశ్ రావు ఆస్తులెన్నో తెలుసా.?