Nagarjuna Sagar: సాగర్ వద్ద టెన్షన్ టెన్షన్.. ఏపీ వైపు నో పర్మిషన్
నాగార్జున సాగర్ డ్యాంపై హైటెన్షన్ నెలకొంది. ఆదివారం రాత్రి నుంచి నాగార్జునసాగర్ ప్రధాన డ్యాంపై విధులు నిర్వహిస్తున్న ఎన్ఎస్పీ ఉద్యోగులు, ఇంజినీర్లను సీఆర్ఫీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో డ్యాంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది నవంబరు 29న అర్ధరాత్రి ఏపీ పోలీసులు, నీటి పారుదలశాఖ అధికారులు సాగర్ ప్రధాన డ్యాంపైకి వచ్చి 13వ నంబరు గేటు వరకు ఏపీ పరిధిలోకి వస్తుందంటూ ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు బలగాలతో ఏపీ తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో డ్యాంకు ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసు బలగాలు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకుని గత డిసెంబర్ 3న ప్రధాన డ్యాంపై ఏపీ, తెలంగాణకు ఇరువైపులా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సాగర్ డ్యాంను సీఆర్పీఎఫ్ బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి జనవరి 17 వరకు తెలంగాణ అధికారులను ప్రధాన డ్యాంకు కుడివైపున 13వ నంబరు గేటు అవతలికి సాధారణంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారే తప్పా, విధులు నిర్వహించేందుకు మాత్రం ఏపీ పరిధిలో ఉన్న కంట్రోల్ రూం వద్దకు కూడా రానివ్వలేదు.
Also read: KTR: తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయి.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం తరువాత.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు. అప్పటి నుంచి నిబంధనలు మారాయంటూ సీఆర్పీఎఫ్ బలగాలు ఎన్ఎస్పీ సిబ్బంది, అధికారులను ఏపీ వైపు వెళ్లకుండా 13వ నంబరు గేటు వద్దే నిలిపి వేస్తున్నారు. ఏపీ వైపు ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు తెలంగాణ ఉద్యోగులను అనుమతించడం లేదు.