BRS Party: ఓటమి నుంచి తేరుకున్న బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికలపై దృష్టి
అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి తేరుకుంటోంది. మూడు నెలల్లో రాబోతున్న లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిదాలను సరిచేసుకుని సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని గులాబీ దళం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల చేవెళ్ల సెగ్మెంట్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సమీక్ష చేసిన విషయం తెలిసిందే. చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురడంతో ఆ స్థానంపై బీఆర్ఎస్ ప్రధాన దృష్టి సారించింది. ఇక రాష్ట్రంలోని మిగతా పార్లమెంట్ స్థానాలపై ఆ పార్టీ సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ (KCR)తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao) చర్చలు మొదలుపెట్టారు. లోక్ సభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ బాస్ తో చర్చించారు.
Also Read విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: హరీశ్ రావు
హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి గురువారం కేటీఆర్, హరీశ్ వెళ్లి చర్చలు జరిపారు. కొన్ని గంటల పాటు ముగ్గురు చర్చించుకున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు చేశారని సమాచారం. కాంగ్రెస్, బీజేపీలు ఎవరిని బరిలో దించుతాయి? వారి వ్యూహాలేంటి అనే వాటిపై చర్చించారు. ఉమ్మడి జిల్లాల వారీగా లెక్కలు వేశారు. వీటితోపాటు ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని నిలపాలని సమాలోచనలు చేశారు. చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం ఎంపీలకు మరోసారి అవకాశం ఇవ్వడంపై చర్చించినట్లు సమాచారం.
Pension: ప్రజలకు సీఎం జగన్ ‘న్యూ ఇయర్ గిఫ్ట్’.. అర్హులందరికీ అందాలి
బీజేపీ సిట్టింగ్ స్థానాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పై ప్రత్యేకంగా చర్చించారు. గతంలో పోటీ చేసిన వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, నగేశ్ లకు ఆయా స్థానాల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెదక్ స్థానంపై కీలక చర్చ జరిగింది. ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలా వద్దా అని చర్చించగా.. నర్సాపూర్ టికెట్ నిరాకరించడంతో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ బరిలో నిలపడంపైన కూడా చర్చించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరిపై కూడా చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికలపై మరోసారి సమావేశమై మరింత చర్చించే అవకాశం ఉంది.