Hyderabad: భాగ్యనగరానికి మరో రికార్డ్.. దేశంలో నెం.1
హైదరాబాద్ దినదినం అభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే.. ఎన్నో మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలే కాదు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందినవారు సైతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మన సిటీ మరో అరుదైన గుర్తింపు తెచ్చుకుంది. భారత దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023 లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పుణె, బెంగళూరు, చెన్నై ఇలా భారతదేశంలోని ఇతర నగరలు.. తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Also read: Winter: తెలంగాణను వణికిస్తున్న చలి.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ “భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం”గా ర్యాంక్ చేయబడింది. ఈ జాబితాలో 153వ ర్యాంక్తో హైదరాబాద్ టాప్ ప్లేస్లో నిలవగా.. 154వ ర్యాంక్తో పుణె, 156వ ర్యాంక్తో బెంగళూరు, 161 ర్యాంక్తో చెన్నై, 164 ర్యాంక్తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్తో కోల్కతా ఆరో స్థానం, 172 ర్యాంక్తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి. 2023 సూచిక ప్రకారం వియన్నా (ఆస్ట్రియా), జూరిచ్ (స్విట్జర్లాండ్), వాంకోవర్ (కెనడా) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ సూచిక విదేశాలలో పనిచేసే ఉద్యోగుల జీవన నాణ్యతను అంచనా వేస్తుంది, ముఖ్యంగా కుటుంబాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల నుండి డేటాపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, పాఠశాలలు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్య ప్రమాణాలు, నేరాలు, కమ్యూనికేషన్ సౌలభ్యం, సామాజిక- రాజకీయ వాతావరణం వంటి అంశాలపై ఆధారపడి ర్యాంకింగ్స్ ఇచ్చింది.
2019లో సంస్థ ర్యాంకింగ్స్ ప్రకటించగా.. అప్పుడు పుణె, హైదరాబాద్ రెండూ 143వ స్థానాన్ని పంచుకున్నాయి. 2022లో, అంతర్జాతీయ ఉద్యోగులు నివసించడానికి అత్యంత ఖరీదైన నగరాలలో ముంబై 127వ ర్యాంక్తో అత్యంత ఖరీదైన భారతీయ నగరంగా అవతరించింది. దాని తర్వాత న్యూఢిల్లీ (155), చెన్నై (177), బెంగళూరు (178), హైదరాబాద్ (192), పుణె (201)వ ర్యాంక్తో ఉన్నాయి. హైదరాబాద్కు దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ 2015 నుంచి వరుసగా ఆరోసారి ఈ ఘనత సాధించిందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వాసులకు శుభాకాంక్షలు చెబుతున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.