WPL-2024: త్వరలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం.. అత్యధిక ధర ఎంతో తెలుసా..?
ఉమెన్ ప్రీమియర్ లీగ్-2024 రెండో సీజన్ మినీ వేలం త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐదు ఫ్రాంచైజీలు ప్లేయర్ల ఎంపికపై భారీ కసరత్తు జరుగుతోంది. ముంబైలో డిసెంబర్ 9న జరిగే ఈ వేలంలో 165 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. అయితే ఈసారి మొత్తం ఐదు జట్లకు అదనంగా రూ.1.5 కోట్ల మనీ పర్సును అందుబాటులో ఉంచనున్నారు. ఈ వేలంలో తొమ్మిది విదేశీ స్లాట్లతో సహా 30 స్లాట్లను భర్తీ చేయనున్నారు. ఈ సీజన్ వేలంలో 56 మంది క్యాప్డ్, 109 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, గుజరాత్ జెయింట్స్ వేలంలో అత్యధికంగా రూ.5.95 కోట్లు ఖర్చు చేయగా.. యూపీ వారియర్స్ రూ. 4 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.3.35 కోట్లు వెచ్చించనున్నాయి. తొలి సీజన్ డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ALSO READ: ప్రపంచ విజేత ఆస్ట్రేలియాకు యువ భారత్ షాక్
అత్యధిక ధరకు డాటిన్, కిమ్..!
వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డియాండ్ర డాటిన్, ఆస్ట్రేలియాకు చెందిన కిమ్ గార్త్ రూ.50 లక్షల కనీస ధరకు తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. కాగా, గత వేలంలో గుజరాత్ జెయింట్స్ డాటిన్ను కొనుగోలు చేయగా ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయమై ఫ్రాంచైజీతో వివాదం కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. ఇక తర్వాత అత్యధిక కనీస ధర అయిన రూ.40 లక్షల కేటగిరీలో నలుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్లు అనాబెల్ సథర్లాండ్, జార్జియా వరేహం, దక్షిణాఫ్రికా పేస్ సంచనలం షబ్నిం ఇస్మాయిల్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ 40 లక్షల విభాగంలో వేలానికి వస్తున్నారు. ఇక రూ.30 లక్షల కనీస ధరలో చమరి ఆటపట్టు(శ్రీలంక), వేద కృష్ణమూర్తి(భారత్), ఇంగ్లండ్ ఓపెనర్ డాని వ్యాట్, ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబే లిచ్ఫీల్డ్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు దరఖాస్తు చేసుకున్నారు.