Telangana: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… సజ్జనార్ కీలక సూచనలు
సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముందస్తు సూచన చేశారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరని సూచించారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని స్పష్టంచేశారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని వివరించారు.
Also Read: కులవృత్తుల రక్షణ ప్రభుత్వ బాధ్యత.. మంత్రి పొన్నం వెల్లడి
ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని తెలిపారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని… ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలన్నారు.