![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/andhra-bjp-780x470.webp)
BJP: ఒంటరిగానే బరిలోకి దిగనున్న బీజేపీ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ‘వై నాట్ 175’ నినాదంతో, సిద్ధం సభలతో వైసీపీ ప్రచారంలో అన్ని పార్టీల కంటే వేగంగా దూసుకుపోతోంది. 90కి పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమీ అర్థం కావడంలేదు. మొన్నటి దాకా టీడీపీ-జనసేనలతో జట్టు కడుతుందని భావించినా ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: వ్యూహం మార్చిన వైసీపీ..మంగళగిరిలో లోకేష్పై అభ్యర్థి ఎవరంటే?
చంద్రబాబు స్వయానా ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. పొత్తుపై చర్చించారు. అయితే టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకే నష్టం కలుగుతుందని భావించిన ఆ పార్టీ అధిష్టానం.. పొత్తుకు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కేవలం 30 స్థానాల వరకే సీట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇలా అయితే పార్టీ బలోపేతానికి ముందు నుంచి కృషి చేస్తూ వచ్చిన బీజేపీ నేతల టిక్కెట్లకు భారీగా గండి పడే ప్రమాదం ఉందని కూడా ఆ పార్టీ భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒంటిరిగానే బరిలోకి దిగాలని చూస్తోంది. ఇప్పటికే లోక్సభ, అసెంబ్లీ జాబితాను సిద్ధం చేసినట్లు తాజా సమాచారం.
One Comment