CM Jagan: ఏపీలో పెరిగిన పెన్షన్.. స్వయంగా అందించనున్న సీఎం జగన్
ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా నగదును పెరగబోతోంది. ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన జగన్ ఇచ్చిన మాట ప్రకారం జనవరి 1 నుంచి సామాజిక పెన్షన్ విలువ రూ. 3 వేలకు పెంచనున్నట్టు సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెంచిన పింఛన్ ను సీఎం జగన్ స్వయంగా అందించనున్నారు. ఈ మేరకు జనవరి 3న కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నానికి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
Also read: Minister Jogi Ramesh: ప్రధానికి పవన్ లేఖ.. మంత్రి జోగి రమేష్ కామెంట్స్
ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ (వైఎస్సార్ పెన్షన్ కానుక) మొత్తాన్ని రూ.3000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పెంచిన మొత్తాన్ని జనవరి 1 నుంచి అమలు చేస్తామని పేర్కొంది. గత ఎన్నికల CMహామీలో భాగంగా పెన్షన్ను రూ.3000 ఇస్తామని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.2,750 గా ఉన్న పెన్షన్ను రూ.3000 కు సీఎం జగన్ పెంచారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు , ట్రాన్స్జెండర్స్, వితంతువులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి 1 నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచుతూ అవ్వాతాతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేరుస్తున్నామని సీఎం జగన్ గతంలో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారు పేరు అని మరోసారి రుజువు చేస్తున్నామన్నారు. పెన్షన్ల పెంపు సందర్భంగా జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.