Manohar Lal Khattar: సీఎం సంచలన నిర్ణయం.. పీఎం రిలీఫ్ ఫండ్ కు మొత్తం ఆస్తి
సహజంగా రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చారంటే కొందరు నేతలు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటారు. లేదంటే బినామీల పేర్ల మీదనో.. లేదంటే బంధువుల పేర్ల మీదనో ఆస్తులు సంపాదిస్తుంటారు. ఎమ్మెల్యే అయితేనే కోట్లు వెనకేసుకుంటారు. ఇక కొందరు నేతలు ముఖ్యమంత్రి అయితే ఎంత సంపాదిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. అలా అక్రమాస్తులు సంపాదించి జైలు పాలైన రాజకీయ నాయకులను ఎంతో మందిని చూశాం. తరతరాలు కూర్చుని తినేంతగా సంపాదించుకుంటారు. కానీ అందుకు భిన్నంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సంపాదించిన ఆస్తులన్నీ పీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చేస్తానని ప్రకటించారు.
Also read: TTD: టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదం.. పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు
హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఖట్టర్ పాల్గొన్నారు. అక్కడ వ్యాపారవేత్త గోపాల్ కందా ముఖ్యమంత్రికి సరికొత్త ఆఫర్ను ప్రకటించారు. ఖట్టర్ పదవీ విరమణ తర్వాత ఢిల్లీ, చండీగఢ్లో ఫామ్హౌస్లు నిర్మిస్తానని బిజినెస్మేన్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను మనోహర్ లాల్ ఖట్టర్ సున్నితంగా తిరస్కరించారు. సంపాదించిన ఆస్తులన్నీ నేనేమీ చేసుకుంటాను. తాను చనిపోయాక ఆస్తుల కోసం బంధువులు కొట్లాడుకుంటారని గోపాల్ కందాకు ముఖ్యమంత్రి ఖట్టర్ బదులిచ్చారు. తనకు ఎలాంటి ఆస్తులు అక్కర్లేదని.. తాను చనిపోకముందు ఆస్తులన్నీ ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేస్తున్నట్లు మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.