![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/kamal-nath.jpg)
Kamal Nath: కాంగ్రెస్ పై కమల్ నాథ్ అసంతృప్తి.. బీజేపీలో చేరుతున్నారా?
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కమల్ నాథ్ అత్యంత అనుభవజ్ణుడైన నేత.. దశాబ్దాలుగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కమల్ నాథ్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. మరోవైపు కమల్ నాథ్ కుమారుడు, లోక్ సభ ఎంపీ నకుల్ నాత్ తన ఎక్స్ ఫ్రొఫైల్ నుంచి కాంగ్రెస్ గుర్తును తొలగించడం కూడా ఈ ఊహగానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొన్నిరోజుల్లో రాబోతున్న లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీని వీడుతున్న నేతలతో ఇప్పటికే గందరగోళంలో ఉన్న కాంగ్రెస్ కు కమల్ నాథ్ పార్టీ మారడం పూడ్చుకోలేని ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: Etala Rajender: కాంగ్రెస్ గూటికి ఈటెల.. వార్తల్లో నిజమెంతా?
కమల్ నాథ్ మధ్యప్రదేశ్ కు 18వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే రాష్ట్రంలో, కేంద్ర మంత్రి మండలిలోనూ అనేక కీలక పదవులు నిర్వహించారు. భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న కమల్ నాథ్ మధ్యప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ నియోజకవర్గం నుంచి తొమ్మిది సార్లు ఎన్నికయ్యారు. లోక్ సభలో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఒకరిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. నెహ్రా- గాంధీ కుటుంబంతో కమల్ నాథ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ఇందిరాగాంధీకి మూడో కుమారుడు అనే పేరు కమల్ నాథ్ కు ఉండేది.
అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీలో కమల్ నాథ్ ప్రాబల్యం తగ్గిందని టాక్. కమల్ నాథ్ అతి విశ్వాసం, ప్రచారంలో అనవసర ప్రయత్నాలు, అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం, అంతర్గత విభేదాలే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని స్థానిక నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పటి నుంచి పార్టీలో కమల్ నాథ్ ప్రాబల్యం తగ్గుతూ వచ్చిందని తెలుస్తోంది. కమల్ నాథ్ లో ఎలాంటి చర్చలు లేకుండానే ఎంపీసీసీ ప్రెసిడెంట్ గా జితూ పట్వారీని అధిష్ఠానం నియమంచడంతోనే అతన్ని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.