![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/07/l63620240703175440-780x470.webp)
Zika Virus: కలకలం సృష్టిస్తున్న ‘జికా’ వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం హైఅలెర్ట్!
మహారాష్ట్రలో నమోదైన జికా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా గర్భిణీలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం, ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే పిండం ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంచేసింది.
ALSO READ: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న రైల్వే.. తాజాగా మరికొన్ని రైళ్లు రద్దు
డెంగీ, చికెన్ గున్యా మాదిరిగానే దోమల ద్వారా జికా వైరస్ సంక్రమిస్తుంది. ఎడిస్ దోమలు కుట్టడం ద్వారా ఇది సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇన్ఫెక్షన్ సోకిన మహిళకు పుట్టబోయే పిల్లలు తల చిన్నగా ఉండడంతో పాటు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే, 2016 నుంచి ఇటువంటి కేసు ఒక్కటి కూడా దేశంలో వెలుగు చూడలేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జికా కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఉండే గర్భిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. నివాస ప్రాంతాలు, పని ప్రదేశాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టాలని అడ్వైజరీలో సూచించింది. జైకా వైరస్పై ప్రజలు ఆందోళనకు గురికాకుండా వైరస్ వ్యాప్తి, లక్షణాలు, జాగ్రత్తలపై సోషల్ మీడియాతోపాటు ఇతర మార్గాల్లో అవగాహన కల్పించాలని కోరింది.
One Comment