BRS Party: కదన రంగంలోకి గులాబీ దళం.. అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యం
అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తదుపరి ఎన్నికలకు సిద్ధమైంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న గులాబీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తో పార్టీ అగ్ర నాయకులు చర్చలు జరిపాయి. ఇప్పుడు కేసీఆర్ ఆదేశాలతో లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించనుంది. వీలైనన్నీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు రచించనుంది.
Also Read సీఎం జగన్ పై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. జనవరి 3 నుంచి 12వ తేదీ వరకు తొలి దశ, సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల విరామం అనంతరం 16 నుంచి 21వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొదట ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో మొదలై చివరగా హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్ తో సమావేశాలు ముగియనున్నాయి.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించాలని గులాబీ దళం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Also Read డీకే శివకుమార్ తో చంద్రబాబు మంతనాలు.. అధికారం కోసం అడ్డదారులు
కాగా ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరూ పాల్గొననున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు తదితరులు సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ ప్రకటించింది.
సమావేశాల తేదీలు
3న ఆదిలాబాద్
4న కరీంనగర్
5న చేవెళ్ల
6న పెద్దపల్లి
7న నిజామాబాద్
8న జహీరాబాద్
9న ఖమ్మం
10న వరంగల్
11న మహబూబాబాద్
12న భువనగిరి
16న నల్గొండ
17న నాగర్ కర్నూల్
18న మహబూబ్ నగర్
19న మెదక్
20న మల్కాజ్ గిరి
21 సికింద్రాబాద్, హైదరాబాద్