Congress: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో భాగంగా.. తొలి అడుగు పడింది. శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకం పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని మహిళందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
Also read: Revanth Reddy: ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్.. అజెండా అదేనా?
రాష్ట్రంలో నివసిస్తున్న బాలికలు, మహిళలు, ట్రన్స్ జెండర్లకు మహాలక్ష్మి పథకం వర్తించనుంది. రాష్ట్రంలో TSRTC పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఇది అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం అమలు కానుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటిన తర్వాత టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించవచ్చు. అలాగే ప్రయాణ సమయంలో మహిళలు ఆధార్ లాంటి ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీల కోసం తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి ఖర్చును భర్తీ చేయనుంది. జీవో నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించింది.