ECI: మంగళహారతి పళ్లెంలో పైసలు .. మంత్రికి ఝలక్ ఇచ్చిన పోలీసులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇక అధికార బిఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ప్రగతిని వివరిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు కూడా రాగా.. తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ పై కూడా ఇలాంటి ఫిర్యాదే వచ్చింది. దీంతో గూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: BRS: గులాబీ పార్టీలో గుబులు రేపుతున్న గుర్తులు.. ఏం చేస్తోందో?
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొంగరగిద్ద గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ కు మద్దతుగా ప్రచారానికి వెళ్లగా.. మంత్రికి స్థానిక మహిళలు మేళతాళాలు, డప్పచప్పుళ్లు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. అయితే మంత్రి.. మంగళహారతి పళ్లెంలో రూ. 4 వేలు ఉంచడం వివాదం రేపింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఆమె డబ్బు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా… మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎస్ఎఫ్టీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.