Sankranti: ‘ఫ్రీ బస్సు’తో ఆటో డ్రైవర్లకు సంక్రాంతి పండుగ లేదు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఫ్రీ బస్సు’తో ఆటో డ్రైవర్లకు సంక్రాంతి పండుగ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వం మంచి చేస్తూ మరొకరి ఉసురు పోసుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆటో కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సిద్దిపేటలో శనివారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీశ్ రావు ప్రారంభించి మాట్లాడారు.
Also Read కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ సితారే: కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ హెచ్చరిక
‘ఆటో కార్మికుల ఆలోచనల్లో మార్పు వచ్చింది.. సొంతంగా సొసైటీ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికే ఆదర్శం. ఫ్రీ బస్సుతో ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలి’ అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేదంటే ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల జీవితంలో సంక్రాంతి పండుగ కనుమరుగైందని తెలిపారు.
Also Read ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం.. త్వరలోనే వైఎస్సార్ సీపీలోకి..?
ఫ్రీ బస్సు కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లు 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని హరీశ్ రావు తెలిపారు. ఆటో కార్మికులను ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు.