![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/ktr-4.jpg)
KTR: తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయి.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
నల్గొండ జిల్లాలో తమ పార్టీ ఎక్కడా ఓటమి చెందుతుందని అనుమానం రాలేదని, ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని, సూర్యాపేటలో మాత్రమే గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన నల్లగొండ లోకసభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి తమకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని.. జనవరి 3న ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గంతో ప్రారంభమైన సమావేశాలు, నల్లగొండతో ముగుస్తున్నాయని, మొత్తం 17 లోకసభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాయని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమీక్షలు మొదలవుతాయని కేటీఆర్ తెలిపారు.
Also read: PM Modi: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు.. ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ
నాగార్జున సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందని కేటీఆర్ విమర్శించారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిoచిన కాంగ్రెస్ పార్టీ… తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో పెడుతోందని దుయ్యబట్టారు. శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని ఆరోపించారు. కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంతో బయట పడిందన్నారు.
కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్నారు. కోమటిరెడ్డి నిమిషానికో మాట మాట్లాడుతున్నారని, ప్రజలు కరెంటు బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని అన్నారు.