Prajavani: మహాలక్ష్మీ పథకంతో ఆటోడ్రైవర్ల ఇక్కట్లు… మంత్రి పొన్నం ఏమన్నారంటే?
ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణికి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు 5126 దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని వచ్చారన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు బస్సులో ఉచిత రవాణా సౌకర్యంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Also Read: చేవెళ్ల నుంచి సోనియాగాంధీ పోటీ చేయనుందా?
ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఈ హామీలను ఏదేమైనా నెరవేర్చి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశారు. ఈ పథకం పేద మహిళలకు ఉపయోగపడటంతో వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కానీ అప్పటి నుంచి ఆటో ఎక్కేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో ఆటో డ్రైవర్లు ధర్నా చేయడంతో పాటు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
Also Read: మాజీ మంత్రి కేటీఆర్కు కర్ణాటక సీఎం కౌంటర్
హైదరాబాద్ లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగుతున్న ప్రజావాణికి తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా జనంగా తరలివస్తున్నారు. తెల్లవారుజము నుంచే ప్రజాభవన్ కు వస్తున్న ప్రజలు.. అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు