![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/11/RAGHU-780x470.jpg)
Raghunandan Rao: ముదిరాజ్ లకు బీజేపీ పెద్దపీట… బీసీ బిడ్డ సీఎం అవుతాడు
బీసీ బిడ్డలకు బీజేపీ హైకమాండ్ పెద్దపీట వేస్తోందని, రానున్న కొద్ది రోజుల్లో ముదిరాజు బిడ్డకు సీఎం పదవి రాబోతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ముదిరాజులను పట్టించుకోని సీఎంకు ఓటు వేయడం అవసరమా అని ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు, డబుల్ బెడ్ రూంలు ఇవ్వకుండా మెజార్టీ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. దుబ్బాకలో వంద పడకల హాస్పిటల్, కొత్త బస్టాండ్ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చానని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూంలను పేదలకు పంపిణీ చేశామని తెలిపారు.
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
దక్షిణ కాశీగా పిలిచే కూడవెళ్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసాద్దర్శన్ పథకం కింద ఎంపిక చేసి 10 కోట్లు మంజూరు చేసి ఆలయ ఆభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదల పక్షాన నిలబడే రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని కోరారు. అనంతరం బల్వంతాపూర్ సర్పంచ్ సౌడు బాల్ లక్ష్మీ కిష్టయ్య, ఉప సర్పంచ్ వెంకట స్వామి, వార్డు సభ్యులు కనకయ్య, విద్యా సాగర్, మహమ్మద్మౌలానా, శంకర్, రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు.
బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు
సిద్దిపేటలో అభివృద్ధి పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీలో మాత్రమే ఒక కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, బీఆర్ఎస్ లో వందేండ్లయినా ఇలాంటి అవకాశం రాదన్నారు. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు వస్తారన్నారు. మంత్రి హరీశ్ రావు అహంకార మాటలు మానుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ రెండు స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.