Revanth Reddy: మెగా డీఎస్సీ… అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని… టీచర్ల పదోన్నతులు, బదిలీలలో ఇబ్బందులపై దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రంలో బడిలేని గ్రామపంచాయతీ ఉండవద్దని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకవేళ విద్యార్థులు లేరని ఏవైనా బడులు మూసివేస్తే కనుక మళ్లీ తెరవాలన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.
Also Read: ‘తలసరి’లో ఏపీ మరోసారి పురోగతి!
విద్యాలయాలకు విద్యుత్ బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.
Also Read: కుప్పంలో చంద్రబాబు పర్యటన… అన్న క్యాంటీన్ ప్రారంభం
ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖ కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.