తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Mulugu: కూల్చేస్తాం.. పేల్చేస్తామంటే ఊకుంటామా? మంత్రి సీతక్క ఆగ్రహం

తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వాన్ని కూలగొడతామనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూల్చివేత వ్యాఖ్యలు రోజురోజుకు తీవ్రమవుతుండడంతో మంత్రి సీతక్క స్పందించారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. కూల్చేస్తాం.. పేలుస్తాం అంటే ఏమిటని ప్రశ్నించారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గులాబీ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని విమర్శించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో శనివారం జరిగిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలను తిప్పికొట్టారు.

Also Read త్వరలో అన్ని జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి

‘మాది గడీల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు ఉండలేకపోతున్నారు. పదేండ్లు తెలంగాణను దోచుకున్న దోపిడీ దొంగలు, 420 బీఆర్ఎస్ అనే ప్రజలు ఓడగొట్టారు’ అని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజాస్వామికంగా మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తాం, పేలుస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ దోచుకున్నదంతా బయటకి వస్తోంది. బీఆర్ఎస్ నాయకుల హయాంలో బడ్జెట్ బారెడు.. ఖర్చు చారెడు’ అని ఎద్దేవా చేశారు.

Also Read గులాబీ పార్టీలో లుకలుకలు.. కేటీఆర్, హరీశ్ ముందే భగ్గుమన్న విభేదాలు

అందరికీ సంక్షేమ పథకాలు
బంగారు తెలంగాణ కాదు.. భ్రమల తెలంగాణ చేశారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. దోచుకున్నది బీఆర్ఎస్ నాయకులై భారం మోయాల్సింది తెలంగాణ ప్రజలా? అని నిలదీశారు. ప్రజా పాలన దరఖాస్తులపై విషయమై మాట్లాడుతూ.. ‘తీసుకున్న ప్రతి దరఖాస్తు డేటా ఎంట్రీ చేస్తారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాగా నేటితో ప్రజాపాలన దరఖాస్తుల గడువు ముగిసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button