Free Bus: మా పోట్ట మీద కొట్టొద్దు.. ఉచిత బస్సుపై ఆటో డ్రైవర్ల ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. గ్రామీణ మహిళలు (Women) ఆహ్వానిస్తుండగా.. పట్టణ ప్రాంత మహిళలు అవసరం లేదని పేర్కొంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఆటో కార్మికులకు గుదిబండగా మారింది. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆటోలకు గిరాకీ ఉండడం లేదు. ప్రయాణం చేసేందుకు మహిళలు రాకపోవడంతో ఆటో స్టాండ్ (Auto Stands)లలో ఆటోలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. డ్రైవర్లు గిరాకీ లేక దిక్కులు చూసుకుంటూ కూర్చున్నారు.
Also Read ఆర్కే రాజీనామాకు గల కారణాలు ఇవే..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ బాగుపడుతదని అనుకుంటే ఉల్టా తమ జీవనోపాధికే ఎసరు వచ్చి పడిందని ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు విద్య, వైద్యం వంటివి ఉచితంగా ఇవ్వాలి కానీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఉచిత బస్సుతో గిరాకీ లేక తమకు ఆదాయం రావడం లేదని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.200 కూడా రావడం లేదని చెబుతూ బాధపడుతున్నారు. ఆదాయం రాక ఈఎంఐలు, ఇంటి ఖర్చులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు.
Also Read వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే పదవికి.. పార్టీకి ఆర్కే రాజీనామా
ఉచిత బస్సు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీలు చేపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు (Protest) దిగుతున్నారు. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు. తమ భవిష్యత్ (Future) గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు. ఉచిత బస్సు సదుపాయం కొనసాగించినా కూడా తమ ఉపాధికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్ లో భారీ ఉద్యమం (Movement) చేస్తామని హెచ్చరిస్తున్నారు.