Modi Tweet: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ ప్రార్థన
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గాయపడడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ప్రధాని ట్వీట్ చేశారు.
చదవండి: మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం.. ఆందోళనలో పార్టీ నాయకులు
‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయమైందని తెలిసి చాలా బాధపడ్డా. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఏం జరిగింది?
ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ (FarmHouse)లో ఉంటున్న కేసీఆర్ గురువారం రాత్రి బాత్రూమ్ లో కాలు జారి కింద పడ్డారు. ఆ సమయంలో కాలికి తీవ్ర గాయమైంది. నడవలేని పరిస్థితిలో ఉండడంతో వెంటనే అర్ధరాత్రి హైదరాబాద్ (Hyderabad) సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి (Yashoda Hospital) తరలించారు. కేసీఆర్ ను పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు నిర్ధారించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్ర చికిత్స చేయాలా వద్దా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. ప్రస్తుతమైతే కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు.
చదవండి: బిల్లు కడుతారా.. మాల్ మూసేయాల్నా? బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక
కాగా అసెంబ్లీ ఫలితాల వెల్లడైన రోజు నుంచి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో వరుసగా సమావేశం అవుతున్నారు. పదవి నుంచి దిగిపోవడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కు ప్రజలు తరలివస్తున్నారు. వారికి ఒకసారి కనిపించి అభివాదం చేసి వెళ్తున్నారు. ఈ సమయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ కోలుకోవాలని ప్రజలు, పార్టీ నాయకులు ప్రార్థనలు చేస్తున్నారు.