TS Government: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
రేషన్ కార్డు లేని వారికి సీఎం రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అర్హులందరికీ త్వరలో కార్డులు జారీ చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, గ్రామ సభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభల్లో కొత్త రేషన్ కార్డులతోపాటు ఇతర దరఖాస్తులను సైతం తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొదట లోగో రివీల్ చేశారు.
ALSO READ: కాంగ్రెస్ 5 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు.. రేపటి నుంచే స్వీకరణ
రేపటి నుంచే ప్రజాపాలన..
తెలంగాణ వ్యాప్తంగా గురువారం నుంచి ప్రజాపాలన ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రాలను ప్రజాప్రతినిధులు స్వీకరించనున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని సీఎం తెలిపారు. నిస్సాహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పట్టణాల నుంచి తండాల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కరించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే ఇటీవల కేటీఆర్ ద్వారా ఓ మహిళ సమస్య పరిష్కారం అయిందని, కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్లలో ఒక లక్షను ఆమెకు ఇచ్చారు.. అది చాలు అని అన్నారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నేతలు పీల్చి పిప్పిచేశారని విమర్శలు చేశారు.