TS Government: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల.. అప్పు ఎంత ఉందంటే?
తెలంగాణ శాసన సభ సమావేశాలు ఇవాళ ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై చర్చ ప్రారంభమైంది. మొత్తం 42 పేజీలతో విడుదల చేసిన శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. ఇందులో పలు కీలక విషయాలను ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71, 757 కోట్లు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పులు రూ.72,658 కోట్లు ఉండగా.. 2014 నుంచి 2023 అనగా పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రం రుణం రూ.3, 89లక్షల కోట్లు అని తెలిపింది.
ALSO READ: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం… తెలంగాణ ప్రజలకు వరం కానుందా?
నేను దురదృష్టంగా భావిస్తున్నా..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నా. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు అని ఆయన అన్నారు.
ALSO READ: ఏపీ అప్పులపై తప్పుడు రాతలు.. సాక్ష్యమిదే?
కొంత సమయం ఇవ్వాలి..
బీఆర్ఎస్ నుంచి మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తదితరులు మాట్లాడారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా..? అని మాజీ మంత్రి హరీశ్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని.. ముందు రోజే డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. శ్వేతపత్రం ఇప్పుడే ఇచ్చారు. దీనిపై కొంత సమయం ఇవ్వాలని హరీష్ రావు, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు కోరారు. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించడంతో సభను స్పీకర్ అరగంట వాయిదా వేశారు.